Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 5:26 pm Posted by : ramakrishna

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ

బతుకమ్మ, బిచ్కుంద : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని  కాంగ్రెస్ యువ నాయకులు భాస్కర్ రెడ్డి అన్నారు. బుధవారం  బిచ్కుంద మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  భాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియడారు. ఆమె పోరాటాలు, చరిత్ర ప్రతి గడపకూ చేరాలన్నారు. దుక్కి దున్నే వాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు, రజాకార్ల అఘాయిత్యాలకు, ఆగడాలకు ఎదురు నిలిచిందన్నారు. స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, మ‌హిళా అభ్యున్న‌తికి తమ ప్ర‌భుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్ గంగాధర్, గోపాల్ రెడ్డి, సాయిని బసవరాజ్ , కొండ్ర బాలకృష్ణ, నగేష్, రాజు, రజక సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.