హైదరాబాద్, బతుకమ్మ : పేదింటి విశ్వకర్మ కార్మిక కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా నిలిచింది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన శామీర్ పేట నరేంద్రాచారి, స్వప్న దంపతుల కుమార్తె ఆశ్రిత మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్ లో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించారు. రెక్కల కష్టంపై బతికే నరేంద్రాచారి హఠాన్మరణం పాలవడంతో బిడ్డ చదువు అగమ్యగోచరంగా మారింది. విద్యార్థిని తల్లి స్వప్నకు కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో విశ్వకర్మ టీవీ చానల్ నిర్వాహకుడు నర్సింహా చారిని సంప్రదించగా ఆయన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు ఆశ్రిత పరిస్థితిని వివరించారు. ఆమె ముందుకు వచ్చి ఆశ్రిత ఫీజు చెల్లిస్తానని భరోసానిచ్చారు. మొదటి సంవత్సరం ఫీజు మొత్తాన్ని శుక్రవారం ఆశ్రిత, ఆమె తల్లి స్వప్నకు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.