Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 6:36 pm Posted by : ramakrishna

సర్కార్ పై జంగ్ సైరన్ మోగించిన తెలంగాణ ఉద్యోగ జేఏసీ

  • సెప్టెంబర్ 8 నుంచి ఉద్యోగులలో చైతన్యం కోసం జిల్లాలో బస్సు యాత్రలు
  • అక్టోబర్ 12న టిజిఈ జేఎసీ ఛలో హైదరాబాద్

 

హైద్రబాద్, బతుకమ్మ : ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల, కార్మిక పెన్షనర్ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ జేఎసీ  ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు జంగ్ సైరన్ మోగించింది. కొత్త గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సమావేశాలు, సమాలోచనలు జరిపిన ప్రభుత్వం స్పందించకపోవడంతో  సెప్టెంబర్ 8 నుంచి ఉద్యోగులలో చైతన్యం కోసం జిల్లాలో బస్సు యాత్రలు చేపట్టాలని, అక్టోబర్ 12న టిజిఈ జేఎసీ ఛలో హైదరాబాద్ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం లో చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు లు ప్రకటించారు. హైద్రాబాద్ లోని నాంపల్లిలో గల  టిఎన్ జిఓ భవన్ లో 206 భాగస్వామ్య సంఘాలు పాల్గొనగా.. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీన వైఖరికి నిరసనగా ప్రధానంగా పెండింగ్ బిల్లుల మంజూరు, పిఆర్సి అమలు, పెండింగ్ డీఏలు మంజూరు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, సిపిఎస్ విధానం రద్దు తదితర 63 డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటించారు.

  • తెలంగాణ ఉద్యోగ జేఎసీ ఉద్యమ కార్యాచరణ ఇలా..

సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సు హైదరాబాదులో తెలుగు లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ నందు సాయంత్రం 3:00 గం.ల నుంచి వేలాదిమంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు నిర్వహణతో పాటు  అదేరోజు 33 జిల్లాల కేంద్రాల్లో ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్ ల యందు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు..

  • సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ జిల్లాల కు బస్సుయాత్రలు, ఉద్యోగుల సదస్సులు..

సెప్టెంబర్8 నుంచి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్ర నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు.. సెప్టెంబర్ 8న వరంగల్ జిల్లా, 9న కరీంనగర్,10న ఆదిలాబాద్,11న నిజామాబాద్, 12న సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో, 15న వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో, 16న మహబూబ్నగర్, 17న నల్లగొండ, 18న ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో 19 నుండి మిగతా జిల్లాలలోబస్సు యాత్రలను నిర్వహించాలని నిర్ణయించారు.

సమావేశానికి నిజామాబాద్ జిల్లా పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Telangana Employment JAC sounds the alarm bell against the government