ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామ పరిధిలోని సామ్య నాయక్ తండాలో మంగళవారం తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తీజ్ పండుగ సందర్భంగా పెళ్లికాని యువతులు వారం రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ గోధుమలతో బతుకమ్మలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా యువతులు గోధుమలతో తయారు చేసిన బతుకమ్మలను అలంకరించి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గిరిజన సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో భారీ ఊరేగింపు చేపట్టారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలు, పాటలతో తండా పరిసరాలు సందడిగా మారాయి. ర్యాలీ అనంతరం బతుకమ్మలను సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో నాయక్ రాములు, రవి, బాదావత్ రవి, మహిపాల్, బంతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
