బతుకమ్మ, మద్నూర్: సైబర్ నేరాలను పసిగట్టాలని కామారెడ్డి పోలీసు కళాబృందం కళాకారులు ఎమ్మెస్ ప్రభాకర్, మద్నూరు ఏఎస్ఐ సుధాకర్, బాన్సువాడ షీ టీం కానిస్టేబుల్ ప్రియాంక లు అన్నారు. మద్నూరులోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం జూనియర్ కళాశాలలో కామారెడ్డి పోలీసు కళాబృందంవారిచే సాంకేతిక సైబర్ నేరాలపై, షీ టీం గురించి, డ్రగ్స్, ట్రాఫిక్ పోలీసు రూల్స్ గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజంలోని యువత సైబర్ నేరాలను పసిగట్టాలని, ఇంట్లో తల్లిదండ్రులకు, అక్కాచెల్లెళ్లకు అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. ఉదాహరణకు సమాజములో జరుగుతున్న యదార్థ సంఘటనలను కొన్నింటిని ఉదాహరించి కథారూపములో చెప్పారు. బాన్సువాడ షీ టీం సభ్యురాలు ప్రియాంక మాట్లాడుతూ-మహిళలపట్ల, అక్కాచెల్లెండ్లపట్ల అసభ్యకరంగా ఎవరైనా ప్రవర్తిస్తే 100 నెంబర్ కు డయల్ చేయాలని, వెంటనే షీ టీం వచ్చి నేరగాలను పట్టుకుంటారని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడవద్దని, మంచిని గ్రహించాలని, చెడును వదిలిపెట్టాలని అన్నారు. మద్నూరు ఏఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ.. రోడ్లపై నడిచే ప్రజానీకం, వివిధ వాహనాలను నడిపేవారు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని అన్నారు. విద్యార్థులు అన్ని విషయాలను తెలుసుకోవాలని, విద్యలో బాగా రాణించాలని సూచించారు. అన్ని విధాలుగా పోలీసులు రక్షణగా ఉంటారని ఏ విషయమైనా నిర్భయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పవచ్చని అన్నారు. కామారెడ్డి పోలీస్ కళాబృందం సభ్యులు సాయిలు, ఎం అనిల్, ప్రిన్సిపాల్ యన్. గంగా కిషోర్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ సుమన్, ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత, సంస్కృతోపన్యాసకులు బి వెంకట్, ఉపాధ్యాయులు వేణుగోపాల్, నరహరిప్రసాద్, జే గణేశ్, సంతోష్, రాము, నాగేంద్ర, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
