- జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు వృత్తి నిబద్ధత తో పని చేసి వారి భవిష్యత్ ను తీర్చి దిద్ధాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నూతన జూనియర్ అధ్యాపకులను జిల్లాలో నియమించిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఖిల్లా బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇంటర్ విద్య అధికారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యా అధికారి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో అధిక సంఖ్యలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లలో విద్యార్థులను చేర్పించి, వారికి కార్పొరేట్ విద్యకు ధీటుగా బోధిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నర్సయ్య్య మాట్లాడుతూ అధ్యాపక వృత్తి కి అవకాశం సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ శాయశక్తులా కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. లక్షలాది రూపాయలను వెచ్చిస్తూ ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న వారిని ప్రభుత్వ కళాశాల ల వైపు మళ్లించేందుకు కృషి చేస్తూ మంచి విద్యాబోధనను అందించాలని ఆకాంక్షించారు. కళాశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యాపకులను జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం తరఫున సన్మానించారు. సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన 46 మంది ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధుల్లో చేరారు. వీరందరూ ప్రభుత్వ అధ్యాపకుల సంఘంలో చేరుతున్నట్లు జిల్లా అధ్యక్షులు నర్సయ్య్య ప్రకటించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ ల సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి చంద్ర విట్టల్, ప్రిన్సిపాల్ లు కాలింగ్ పాషా, శ్రీనాథ్, రజియుద్దిన్ అస్లాం, గంగాధర్, ప్రభుత్వ అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ, మహిళా కార్యదర్శి పవన శ్రీ, సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు, కోశాధికారి ప్రసాద్, సభ్యులు జాఫర్, ప్రకాష్, రఘునందన చార్యులు, సురేష్, శంకర్, అరవింద్ పలువురు సీనియర్ అధ్యాపకులు పాల్గొన్నారు.
