Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 7:35 pm Posted by : ramakrishna

ఉపాధ్యాయ ఉమ్మడి సర్వీస్‌ నిబంధనలు రూపొందించాలి

 

. . . ఎస్టీయూటియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు నూతనంగా ఉమ్మడి సర్వీస్‌ నిబంధనలు రూపొందించాలని ఎస్టీయూ టియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఆర్ & బి గెస్ట్ హౌస్ లో మంగళవారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వులు – 2018 ప్రకారం సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి, ఖాళీగా ఉన్న 600 కు పైగా ఎంఈవో పోస్టులు, 80 డిప్యూటీ ఈవో క్యాడర్ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో పాఠశాలల పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో మేరకు సిపిఎస్ రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మోడల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం బేసిక్ పే, సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశ అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. రాజు ను కలిశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పలు ఉపాధ్యాయ సమస్యలపై వారు చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలీ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ కలీమొద్దీన్, పంపరి ప్రవీణ్ కుమార్ నాయకులు వి. వేణుగోపాల్, కాజామోహినుద్దీన్ పాల్గొన్నారు.

 

Teachers' joint service rules should be formulated