నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు విత్తన దుకాణాలలో మంగళవారం టాస్క్ఫోర్స్ అధికారులు విత్తనాల నాణ్యత, కల్తీ విత్తనాల నివారణకై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ, సీడ్స్ సర్టిఫికేషన్, పోలీస్ శాఖ సంయుక్తంగా తనిఖీలు చేసి స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, విత్తన ప్యాకెట్లు లాట్ నంబర్స్, సర్టిఫికేషన్, వాలిడిటీ తేదీ తదితర వివరాలను పరిశీలించారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలను చేపట్టగా, లాభా పేక్షతో కల్తీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు లైసెన్సు పొందిన ఆధికృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. డీలర్లు రైతులకు విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులు విత్తన రసీదు బిల్లులు పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఏడీఏ ఎంఏ. హలీం హైమద్, మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నాగేష్, ఏఎస్ఐ లయాక్ అలీ, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, ఏఈఓ చక్రపాణి పాల్గొన్నారు.
