Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 9:43 pm Posted by : ramakrishna

పుష్యమి నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమలలో స్వర్ణామృత ప్రాశన సేవలు

నర్సింగ్ పల్లి, బతుకమ్మ :

 

ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పుష్యమి నక్షత్రం సందర్భంగా చిన్నారులకు స్వర్ణామృత ప్రాశన ఔషధ ప్రసాద సేవలను ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి ఆలయానికి తరలివచ్చి ఈ దివ్య ఔషధ ప్రసాదాన్ని స్వీకరించారు. భారతీయ సంప్రదాయంలో ఆలయాలు కేవలం దైవ దర్శనాలకే పరిమితం కావని, అవి సాంస్కృతిక వికాసానికి కేంద్రబిందువులుగా, సమాజానికి జ్ఞానాన్ని అందించే విద్యా నిలయాలుగా ఉండేవని పెద్దలు చెబుతుంటారు. అదే భావజాలాన్ని ఆచరణలో చూపిస్తున్న వ్యక్తిగా ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, శిరీష్ల సోదరుడు నరసింహారెడ్డి పేరు స్థానికంగా విశేష గుర్తింపు పొందుతోంది. తన స్వగ్రామమైన నర్సింగ్ పల్లిలో నిర్మించిన ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రాన్ని ఆయన ఆధ్యాత్మిక, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఔషధ సేవల ద్వారా ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. మాఘ పౌర్ణమి సందర్భంగా సంతాన ప్రాప్తి కోసం ఇచ్చే ప్రత్యేక ఔషధ సేవలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ సేవల ద్వారా అనేక మంది దంపతులు సంతాన సాఫల్యం పొందారని భక్తులు విశ్వసిస్తున్నారు. అదే విధంగా ప్రతి పుష్యమి నక్షత్రం రోజున చిన్నారులకు అందించే స్వర్ణామృత ప్రాశన సేవ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లల్లో శారీరక దారుఢ్యం, రోగనిరోధక శక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి వ్యవసాయం, ఆయుర్వేద పరిరక్షణకు కూడా ఆలయం ప్రాధాన్యం ఇస్తోంది. “ఆహారమే ఔషధం” అనే భావనను ప్రజల్లో విస్తృతంగా చాటుతూ, కనుమరుగవుతున్న పలు ఫలవృక్షాలు, ఔషధ మొక్కలను ఆలయ ప్రాంగణంలో సంరక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా నరసింహారెడ్డి ఆధునిక ధన్వంతరిగా స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

 

Swarnamrut Prashana services at Tirumala, Indore on the occasion of Pushyami Nakshatra