Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 7:52 pm Posted by : ramakrishna

యువతను జాతి నిర్మాణానికి సిద్ధం చేయడమే స్వామి వివేకానంద జీవిత లక్ష్యం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యువతను జాతి నిర్మాణానికి సిద్ధం చేయడమే స్వామి వివేకానంద జీవిత లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నగరంలోని 28వ డివిజన్ గాజులపెట్‌లోని స్వామి వివేకానంద విగ్రహానికి, అలాగే 10వ డివిజన్ నాగారం‌లోని స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప మహానీయుడిగా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. “లేవండి – మేల్కొండి – లక్ష్య సాధన వరకు ఆగకండి” అనే ఆయన సందేశం నేటికీ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని, ఆ మాటలను ఆచరణలో పెట్టినప్పుడే వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజం కూడా ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సేవాభావం యువతలో పెంపొందితేనే బలమైన భారతదేశం నిర్మాణం సాధ్యమని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, విజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించుకుంటూ సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక 28 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఇల్లేందుల మమతా, ప్రభాకర్ బీజేపీ నాయకులు నాగరాజు, మఠం పవన్, నారాయణ యాదవ్, పుట్ట వీరేందర్, గట్ల గంగాధర్, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వివేకానందకు నివాళులు అర్పించారు.