– ప్రజల ప్రాణాలతో చెలగాటం
– ఇష్టం ఉంటే తీసుకోండి.. లేకపోతే లేదంటున్న రేషన్ డీలర్
రుద్రూర్, బతుకమ్మ : ముక్కిపోయి, సన్నని తెల్ల పురుగులు, రెక్కల పురుగులు ఉన్నాయని, వాసన చూస్తే ఈ బియ్యం ఎలా తినాలని గ్రామస్తులు వాపోతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం(ఆర్) గ్రామంలో గల రేషన్ దుకాణంలో ప్రజలకు సరఫరా చేస్తున్న బియ్యంలో మొత్తం ముక్కిపోయి, పురుగులు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల అధికారుల అలసత్వం వలన గ్రామంలో రేషన్ షాప్ లో ముక్కిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారన్నారు.

పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యత లోపించడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. అధికారుల అలసత్వం, పర్యవేక్షణ, లేకపోవడంతో పురుగులు పట్టిన రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. నాణ్యత లోపించిన బియ్యాన్ని వెంటనే తిరిగి పంపించి మంచి బియ్యాన్ని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరారు.
