. . . డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజల మధ్య నిరంతరం ఉంటూ, ప్రజలనే కుటుంబంగా భావించి పనిచేసే నాయకుడు సుదర్శన్ రెడ్డి అని, అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ఆయన ముందుకు సాగుతున్నారని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు, నగర మేయర్ ఉమారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సలహాదారుగా సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సాగు, తాగునీటి రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.

అల్లీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేశారని, విద్యా, వైద్య రంగాల అభివృద్ధిలో భాగంగా మెడికల్ కళాశాల ఏర్పాటుకు విశేషంగా పనిచేశారని తెలిపారు. సుదర్శన్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్, రత్నాకర్ గౌడ్, కోశాధికారి భక్త వాత్సలం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మైనార్టీ నాయకులు జావీద్ అక్రం, రాష్ట్ర నాయకులు రామర్తి గోపి, కార్పొరేటర్లు, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
