. . . మూడు,నాలుగు రోజులకొకసారే స్నానాలు
. . . విద్యార్థుల అవస్థలపై ప్రత్యేక దృష్టి సారించని పై అధికారులు
. . . ఏకలవ్య పాఠశాలలో నెలకొన్న దుస్థితి
ఇందల్వాయి, బతుకమ్మ
ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నీటి కొరత తీవ్ర రూపం దాల్చింది. నిత్యం వందలాది మంది విద్యార్థులు ఉండే ఈ వసతి గృహంలో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. విద్యార్థులు స్నానం చేయడానికి నీరు దొరకని పరిస్థితి నెలకొందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోజువారీ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు ఉదయం 5:30 గంటలకే నిద్ర లేస్తున్నప్పటికీ, బాత్రూమ్లలో నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడి కారణంగా విద్యార్థులు మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

40 వేల లీటర్లు వస్తున్నా సరిపోవడం లేదని విద్యార్థులు తెలుపుతున్నారు.పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా రోజుకు దాదాపు 40 వేల లీటర్ల నీరు సరఫరా అవుతున్నప్పటికీ, అది ఏమాత్రం సరిపోవడం లేదన్నారు.పాఠశాల ప్రాంగణంలో ప్రస్తుతం నూతనంగా కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి.క్యూరింగ్ పేరిట వృథా చేస్తున్నారని తెలిపారు.ఈ నిర్మాణాలకు వాటర్ క్యూరింగ్ (తడుపడం) కోసం కూడా మిషన్ భగీరథ తాగునీటినే వాడుతుండటంతో విద్యార్థులకు నీటి కొరత మరింత తీవ్రమైంది.విద్యార్థులు మాట్లాడుతూ మాకు త్రాగడానికి, స్నానాలకు నీరు సరిపోవడం లేదన్నారు. అలాంటిది భగీరథ నీటితో నూతన నిర్మాణాలకు క్యూరింగ్ ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ఉన్నారనే భావన లేకుండా తమకు చుక్క నీరు కూడా దొరకకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు,విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏకలవ్య పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.విద్యార్థులకు ఇచ్చే నీటిని నిర్మాణ పనులకు వాడకుండా చూడాలని కోరుతున్నారు. విద్యార్థుల అవసరాలకు మాత్రమే నీటిని వాడుకునేటట్లు చూడాలని స్థానికులు,విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
