Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 3:06 pm Posted by : ramakrishna

సూపర్ బ్రెయిన్ యోగాపై విద్యార్థులకు అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్యసమాజ్ ఇందూరు చే నిర్వహింపబడే రాధా కృష్ణ ఉన్నత పాఠశాలలో  “సూపర్ బ్రెయిన్ యోగా” అనే అంశంపై గుంజీళ్ళ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగ” యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగ అనేది గుంజీళ్ళ మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగ చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని అన్నారు. ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ద, సమస్యా పరిష్కారం, అభ్యసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు, ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. యోగ ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు  మేలు జరుగుతుందని అన్నారు. గుంజీళ్లు తీయడాన్ని శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలని అన్నారు. బహుళ ప్రయోజనాలు ఉన్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చునని తెలిపారు.  కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. తాను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో సమర్పించిన పరిశోధనా పత్రాల ప్రతులను ప్రధానోపాధ్యాయురాలు అనిత నకు ఆందజేసారు.  కార్యక్రమంలో ఆర్యసమాజ్ సెక్రటరీ నారాయణ,  బోధనా సిబ్బంది అఖిల, స్రవంతి, సృజన పాల్గొన్నారు.

Students' awareness on Super Brain Yoga