నసురుల్లాబాద్, బతుకమ్మ : నసుర్లలాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని వసతులను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.బాల్ రాజ్, తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని ప్రతిరోజు అందించాలని వివరించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించేటట్లుగా స్థానిక వైద్య సిబ్బంది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వర్షాకాలం కావున సీజనల్ వ్యాధులు రాకుండా విద్యార్థులకు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేస్తూ పాఠశాల వెలుపల బయట ప్రిమిసెస్ లో ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని తెలియజేశారు. గిరిజన పాఠశాలలో విద్య ప్రమాణాన్ని పెంచాలని ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని విద్యార్థులకు చదువుతోపాటు మానసిక క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పి డి ఎస్ యు (ఎస్) నాయకులు ఎన్.సాయిబాబా, ఆర్. ప్రశాంత్, టిఎస్పి నాయకులు జీ.ఆదర్శ్ కుమార్, ప్రిన్సిపాల్ మాధవరావు, వసతి గృహాధికారిని రాధా పాల్గొన్నారు.
