. . . రామ్ చరణ్ సూసైడ్ కు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి
. . . పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఏకలవ్య పాఠశాలలో దుర్ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం పాఠశాలలో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ విద్యార్థి రామ్ చరన్ సెల్ ఫోన్ తీసుకువచ్చి ఉపయోగించినట్లు సమాచారం.

దీనిపై ఉపాధ్యాయురాలు అతనిని మందలించి కొంతసేపు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. అనంతరం పిలిచి తిరిగి తరగతి గదిలోకి అనుమతించినా, రెండోసారి కూడా రామ్ చరణ్ ఫోన్ వాడుతున్న సమయంలో అతను పట్టుబడి, ఉపాధ్యాయురాలు మందలించడంతో రామ్ చరణ్ భయానికి గురైనట్టు సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఆ తర్వాత అతను బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన పాఠశాలలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమారుడు ఉన్నత చదువులు చదువుతాడనుకుంటే ఇలాంటి సంఘటన జరగడం తమ కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మరణానికి కారణం అయినవారిని చట్టపరంగా శిక్షించాలన్నారు. పాఠశాలలో జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల నిర్వహణ ఉపాధ్యాయులు, విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో విషయం తెలుసుకున్న పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ ఏకలవ్య పాఠశాలకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి మరణానికి బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకొని మృతి చెందిన రామ్ చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న పీడీఎస్ యూ నాయకులను స్థానిక పోలీసులు సిఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై జి సందీప్, డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్ లు కల్పించుకొని ఆందోళనకారులను సముదాయించారు.
