నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్ లోని కాకతీయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి భవనం నుంచి దూకాడు. ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ కు చెందిన విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాలలో పరీక్షల సందర్భంగా కాపీ కొడుతుండగా ఉపాధ్యాయులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పరీక్షల అనంతరం విద్యార్థి మూడవ అంతస్తు నుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో విద్యార్థి కాలువిరిగి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ పరిశీలించారు. తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. పాఠశాలలో సీసీటీవీ పుటేజిలను పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు.
. . . విద్యార్థి వైద్యానికి యజమాన్యం భరించాలి
కాకతీయ స్కూల్ యమునా క్యాంపస్ లో రెండు రోజుల క్రితం 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మూడు అంతస్తుల నుండి దూకడంతో దవడకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయని, విద్యార్థి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని విద్యార్థికి సంబంధించిన పూర్తి వైద్యం యాజమాన్యం భరించాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. విద్యార్థి ఎఫ్ఏ-2 పరీక్షల్లో చిట్టీలు కొడుతున్నాడని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపించారు.
