. . . 12 మంది తోటి విద్యార్థులపై ఆరోపణలు
మేడ్చల్, బతుకమ్మ :
దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థిపై హాస్టల్లో రాత్రి సమయంలో 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేసి, బూట్లతో ముఖంపై తొక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన అనంతరం తమ కుమారుడు మెట్లపై నుంచి కిందపడిపోయాడంటూ పాఠశాల యాజమాన్యం ఫోన్ చేసి సమాచారం ఇచ్చిందని వారు వెల్లడించారు.

వెంటనే పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు అభిషేక్ను ఇంటికి తీసుకువచ్చారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే తనపై ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు దాడి చేసినట్లు అభిషేక్ తల్లిదండ్రులకు వెల్లడించినట్లు సమాచారం. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిపై దాడికి పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఘటనను బయటకు రాకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించిన పాఠశాల యాజమా న్యంపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. దాడికి గల పూర్తి కారణాలు, ఘటనలో పాల్గొన్న విద్యార్థుల పాత్ర, పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
