Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 6:31 pm Posted by : ramakrishna

ఎస్ఐఆర్ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యల కింద బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్.ఐ.ఆర్ అమలు తీరుపై కలెక్టర్ శుక్రవారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఎస్.ఐ.ఆర్ అమలును పరిశీలిస్తూ, పనితీరులో వెనుకంజలో ఉన్న ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ, ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. మీ బాధ్యతారహిత వైఖరి కారణంగా ఎస్.ఐ.ఆర్ సన్నాహక అమలులో అర్బన్ సెగ్మెంట్ వెనుకంజలో ఉందని మండిపడ్డారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్ఓలతో మ్యాపింగ్ ను పక్కాగా జరిపించాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియ అమలుపై తాను క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తానని, పురోగతి సాధించని వారిపై వేటు తప్పదని కలెక్టర్ కరాఖండిగా తేల్చి చెప్పారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, సౌత్ తహసీల్దార్ బాలరాజు, అధికారులు పాల్గొన్నారు.

Strict action will be taken against those who neglect the implementation of SIR.