నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : యూనివర్సిటీ హాస్టల్లో నాసిరకం వస్తువులు సప్లై చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన సప్లయర్ పైన, అవినీతిలో భాగస్వామ్యమైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు హాస్టల్స్ నుండి అడ్మిన్ వరకు శుక్రవారం ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం ఓల్డ్ బాయ్స్ హాస్టల్ మెస్ లో నాసిరకమైన వస్తువులు దోరికాయని విద్యార్థుల ఆందోళనతో ఎంక్వయిరీ కమిటీ వేశారని, నేటికి ఎంక్వయిరీ రిపోర్టు బయట పెట్టకుండా బాధ్యుల పైన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కి వస్తువులను సప్లై చేసే సప్లైయర్ పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై భారం వేసిన రెండు నెలల మెస్ బిల్లుల పూర్తిగా రద్దు చేయాలని, సప్లయర్ అవినీతికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోవడం వలన పరీక్షల విభాగ అధినేత ప్రొఫెసర్ సంపత్ ధర్నా కార్యక్రమం దగ్గరికి చేరుకొని రిజిస్ట్రార్ తో ఫోన్లో మాట్లాడించి త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిజిస్ట్రార్ హామీతో విద్యార్థులు ధర్నా కార్యక్రమం విరమించారు.
