. . . ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా అధికారులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక శ్రద్ధ వహించి పేద ప్రజలకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. నగరంలోని 34 వ డివిజన్ పరిధిలోని మిర్చి కంపౌండ్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిజెపి యువ నాయకుడు బంటు ప్రవీణ్ కుమార్ (పండు) ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున తమ బిజెపి నాయకుడు పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇలాంటి యువకులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. పేద, మధ్య తరగతి వారికి ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యమేనని తర్వాత (ఆవాస్) ఒక గృహాన్ని నిర్మించుకోవడం చిరకాల స్వప్నమని, వీటిని నిర్వర్తించి పేదలకు సమకూర్చాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించాక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించానని, అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు చూశానని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణలో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తర్వాత అత్యధిక ఓపి పేషెంట్లు మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని, కేవలం జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వైద్యం కోసం పెద్ద ఎత్తున పేషెంట్లు వస్తారని అన్నారు. కానీ ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా ఆరోగ్యపరమైన మిషిన్లు లేకపోవడం, అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండకపోవడం పేదవారు చేసుకున్న దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన మిషన్ జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నప్పటికీ అది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం దురదృష్టకరమైన విషయం అన్నారు. అధికారులు వీటి మీద ద్రష్టి సారించాలని ఆయన కోరారు. అనంతరం షుగర్ టెస్ట్ లు, బిపి టెస్టులతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ హెల్త్ క్యాంప్ లో ఎంఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు జనరల్ మెడిసిన్ డాక్టర్ దొరబాబు, జనరల్ సర్జన్ డాక్టర్ వెంకటరమణ, న్యూరో సర్జన్ డాక్టర్ సర్పరాజ్ పాల్గొన్నట్లు బిజెపి యువ నాయకుడు బంటు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
