- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

రాజంపేట, బతుకమ్మ : పంట నష్టం వివరాలను త్వరగా సేకరించి బాధిత రైతులకు త్వరగా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ రాజంపేట మండలంలో పర్యటించారు. జిల్లాలో వరుసగా కురిసిన వర్షాల ప్రభావంతో రాజంపేట మండలంలో జరిగిన పంట నష్టాన్ని మండల స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల వ్యాప్తంగా పంట నష్టం వివరాలను త్వరగా సేకరించి రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రాజంపేట మండల కేంద్రం నుండి ఆరుగొండ గ్రామానికి వెళ్లే రోడ్డును పరిశీలించి దాని మరమ్మత్తు చేయాలనీ రోడ్డు మరియు భవనాల శాఖ అధికారులకు చెప్పడంతో మరమ్మత్తు పనులు వేగవంతం జరిగేలా ఆర్ అండ్ బి శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే మండలంలో దెబ్బతిన్న ఇండ్ల వివరాలను త్వరగా సేకరించి నివేదిక అందించాలని, ఇనాంతండా వద్ద చేపట్టిన రోడ్డు మరమత్తు పనులను వేగవంతం చేయాలని, గ్రామాలలో ఎలాంటి పారిశుద్ధ్య సమస్య రాకుండా రెగ్యులర్గా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారం ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో కామారెడ్డి ఆర్డిఓ వీణ, ఆర్ అండ్ బి ఈఈ మోహన్, వ్యవసాయ శాఖ ఏడి అపర్ణ, తహసిల్దార్ జానకి, ఎంపీడీవో బాలకృష్ణ, మండల ప్రత్యేక అధికారి, ఆర్ అండ్ బి, వ్యవసాయ రెవెన్యూ వన్ గ్రామపంచాయతీ తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.
