. . . ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎం. సోమనాథం విద్యార్థులకు పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), నిజామాబాద్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గిర్రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ యువత మంచి స్నేహాలను ఎంచుకుని తమ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సరదా కోసం ఒక్కసారి మాదకద్రవ్యాలను వినియోగించినా అది క్రమంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలను విద్య, నైపుణ్యాభివృద్ధికి అంకితం చేసి స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్-ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు, కఠిన చర్యలను కొనసాగిస్తోందని ఆయన తెలిపారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తి ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములై రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. తోటి వారి ఒత్తిడికి లోనుకాకుండా కుటుంబ సభ్యులు, సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు. సీబీసీ నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చట్టపరమైన పరిణామాలపై యువతకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. “డ్రగ్స్ కు నో… జీవితానికి యెస్” అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈగల్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చే నిధులు నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. డ్రగ్ మాఫియా ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుంటుందని, అందువల్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాంగ్ అండ్ డ్రామా బృందం ప్రదర్శించిన పల్లె సుద్దులు జానపద కళారూపం ద్వారా నషా ముక్త్ భారత్ అభియాన్ సందేశాన్ని ఆకట్టుకునే విధంగా అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు నహీదా బేగం, అధ్యాపకులు, ఆకాశవాణి ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ మోహన్ దాస్, సీబీసీ సిబ్బంది, అలాగే 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
