Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 5:45 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలవడమే అమరవీరులకు అర్పించే ఘనమైన నివాళి

 

. . . వర్గీకరణ అమలు చేసి అమరుల ఆశయాలను సాధించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

 

. . . కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్ బతుకమ్మ :

 

ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలవడమే మాదిగ అమరవీరులకు అర్పించే ఘనమైన నివాళి అని కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్థన్ రెడ్డి అన్నారు. మూడు దశాబ్దాల ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన మాదిగ అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం టీఎంఆర్ పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా లో మాదిగ అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమ ఘట్టాలలో వీరోచితమైన పాత్రను పోషించి, జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం తృణప్రాయంగా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి నేలరాలిన మాదిగ అమరవీరుల స్పూర్తి తోనే రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ అమలు చేసిందని అన్నారు. అంతే కాకుండా మంత్రి దామోదర రాజనర్సింహ అమర వీరుల కుటుంబాల ఇండ్లకు వెళ్ళి వారి పాదాలు కడిగి రూ.5 లక్షలు అందజేసి, వారి కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. అనంతరం టీఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం నడిచిన పోరుబాటలో అనేకమంది బిడ్డలు అసువులు బాసారన్నారు. నాడు వారి అమరత్వం సాక్షిగా వర్గీకరణను సాధిస్తామని ప్రమాణం చేశామని, నేడు ఆ ప్రమాణం సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధించి అమరుల ఆశయాలను నెరవేర్చామని అన్నారు. వర్గీకరణ అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదిగ అమరవీరుల స్థూపం కొరకై 2000 గజాల స్థలం హైదరాబాద్ నగరంలో కేటాయించాలని, అలాగే వర్గీకరణ కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలని, అలాగే వారికి 250 గజాల స్థలాన్ని కేటాయించాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలోనే టీఎంఆర్ పీఎస్ వ్యవస్థాప అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ నేతృత్వంలో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్ పీఎస్ పట్టణ అధ్యక్షులు మల్లేష్ మాదిగ, మహిళా సమైక్య నగర అధ్యక్షురాలు బంటు జ్యోతి మాదిగ, మాదిగ ఉద్యోగస్తుల సంఘం మైసయ్య, రాములు, రమేష్ టీఎంఆర్ పీఎస్ సీనియర్ నాయకులు తెడ్డు గంగారం తదితరులు పాల్గొన్నారు.

 

Standing by the Congress party is a great tribute to the martyrs.