- పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : క్రీడలు జీవితాన్నే మార్చేస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫుట్బాల్ ఒక టీం గేమ్ అంటే ఆషామాషి క్రీడాకాదని, ఫుట్బాల్ టెక్నిక్ తో ఆడాల్సిన గేమ్ అని అన్నారు. ఫుట్బాల్ ను రోజుకు నాలుగు గంటలైనా సాధన చేసినప్పుడే ఫుట్బాల్ క్రీడా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. చదువుతోపాటు క్రీడలు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 350 కోట్ల నిధులను క్రీడాభివృద్ధి కొరకు కేటాయించిందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కోచ్ లు లేకుండా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. జిల్లాలో అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారని ఆయన అన్నారు. ఓడిన క్రీడాకారులు బాధపడకుండా గెలుపు కొరకు రోజు క్రీడలను సాధన చేయాలని ఆయన చెప్పారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన రంగారెడ్డికి, ద్వితీయ స్థానంలో నిలిచిన నిజామాబాద్ కు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు, కార్యదర్శి, కాంగ్రెస్ నాయకులు కుదురు, ఫుట్బాల్ కోచ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
