Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 5:48 pm Posted by : ramakrishna

స్త్రీ జీవితంలో ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైనది

 

. . . విజ్ఞాన మహాసభల్లో ధరానంత భారతి స్వామి

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

స్త్రీ జీవితంలో ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైనదని, ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, వ్రతాలు మాత్రమే కాదని, అది మనసు శుద్ధి, ధర్మబద్ధమైన ఆలోచనలు, సహనం, ప్రేమ, సేవ భావనలను పెంపొందించడమని ధరానంద భారతి స్వామి అన్నారు. మండలంలోని గోదావరి నది తీరాన గల తడపాకల్ దత్త సాయి మందిర పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమాలయ వ్యవస్థాపకులు నిర్గుణ తత్వ మహారాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక విజ్ఞాన మహాసభల్లో భాగంగా శనివారం సామూహిక భజనలు చేసి సత్సంగం నిర్వహించారు. తదనంతరం మోర్తాడ్ కు చెందిన దయానంద ఆర్య యజ్ఞం నిర్వహించారు. విజ్ఞాన మహాసభలకు ప్రధాన వక్తలుగా వచ్చిన  ధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వామి మాట్లాడుతూ స్త్రీ జీవితం అనేది కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాదని, ఆధ్యాత్మికత, గృహస్థ జీవితం, సమాజంలో స్థానం ఈ మూడింటి సమన్వయం ఆమె జీవన సార్ధకతను నిర్ణయిస్తుందని అన్నారు. స్త్రీ ఆధ్యాత్మికతను ఆచరించినప్పుడు కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయని, తల్లి రూపంలో పిల్లలకు మంచి విలువలు నేర్పుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి అర్చకులు బోనగిరి గంగాధర్,  శివయోగి దివ్య యోగాశ్రమము తిమ్మాపూర్ అరుణానంద మాతాజీ, శైలం మాతాజీ, మీడియా ప్రతినిధి కంకణాల రాజేశ్వర్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన భక్తులు, తడపాకల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Spirituality is very important in a woman's life.