బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని ప్రఖ్యాత చక్రేశ్వర శివాలయం లో ఈనెల 7న ఆదివారం జరిగే చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 11 గంటల 25 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుండగా, గ్రహణానికి ముందు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయబడతాయని పేర్కొన్నారు. గ్రహణ సమయం ముగిసే వరకు ఆలయ ప్రాంగణం భక్తులకు అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం గ్రహణం సమయంలో దేవాలయ ద్వారాలు మూసివేయడం అనాది సంప్రదాయం అని తెలిపారు. భక్తులు కూడా ఈ ఆచారాన్ని గౌరవించి, ఇంటిపట్టునే భక్తి శ్రద్ధలతో జపాలు, ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మరుసటి రోజు సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలను తిరిగి తెరుస్తారని, అనంతరం ప్రత్యేక శుద్ధి కర్మలు, పునఃప్రతిష్ఠా పూజలు జరిపి, ఉదయం 7 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని గణేష్ మహారాజ్ తెలిపారు. భక్తులు గ్రహణ సమయంలో శుద్ధి, ఆచారాలు పాటిస్తూ స్వామివారి కటాక్షాన్ని పొందాలని ఆలయ అర్చకులు ఆకాంక్షించారు.