. . . ఆపరేషన్ క్రాక్ డౌన్ ద్వారా పట్టుబడ్డ నేరస్తులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలో ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. అక్రమంగా బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ఒక నెట్వర్క్ ను నాలగవ టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసు ల సహాయంతో విజయవంతంగా బట్టబయలు చేశారు. ఈ నేరంలో భాగమైన వారిని బుధవారం అరెస్ట్ చేశారు. వీరు వివిధ నెంబర్లతో, ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి బిజినెస్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి, వాటిని సైబర్ మోసగాళ్లకు అందించడం ద్వారా భారీ స్థాయిలో మోసాలకు సహకరించినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రాథమిక విచారణలో ఈ అకౌంట్ల ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలో సుమారు రూ.31 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, ఈ మొత్తాన్ని వివిధ రకాల సైబర్ మోసాలకు వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, మరి కొంత మంది వ్యక్తులు ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని, వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయనన్నారు. మొహమ్మద్ అజర్, శ్యామల నవీన్, ఖాసిం పటేల్, మొహమ్మద్ మినాజ్ అహ్మద్, సయ్యద్ హఫీజ్ లను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్కు పంపించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడతూ మీ బ్యాంక్ అకౌంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకూడదని, అమ్మకూడదని, ఓటీపీ, పిన్, సీవీవీ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని, తెలియని కాల్స్, లింక్స్, మెసేజెస్పై నమ్మకం పెట్టుకోకూడదని, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే ఆఫర్లను నమ్మకూడదని ప్రజలకు సూచించారు. అలాగే ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని, లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన కోరారు.