Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 6:03 pm Posted by : ramakrishna

నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి

 

. . . అధికారులతో సమీక్షలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని శాసనమండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆయన నగర అభివృద్ధిపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు, అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ పనులు తదితర అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరంలోని అన్ని ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని అన్నారు. అవసరమైన చోట వన్ వే అమలు చేయాలని, యూటర్న్ ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్డు భద్రత నిబంధనలు పక్కగా పాటించేలా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తూ, ట్రాఫిక్ రూల్స్ ను పక్కాగా అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కాగా, ఆయా ప్రాంతాలలో రోడ్లపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయించాలని చెడిపోయిన రహదారులకు మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో గుంతల వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ఈ పనులకు తక్షణమే చేపట్టాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన పురాతన వాటర్ ట్యాంకులను కూల్చి వేయించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఫూలాంగ్ చౌరస్తా, ఓల్డ్ ఎల్ఐసి చౌరస్తా తదితర ముఖ్య కూడళ్ళ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులకు అవకాశం లేకుండా సర్కిళ్లను వెడల్పు చేయాలని అన్నారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ భవన సముదాయాల పనులను, కళాభారతి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయించి యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయించాలని సూచించారు. తాగునీటి సరఫరా లో ఇబ్బందులు ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎల్లమ్మ గుట్టలో మంచినీటి ట్యాంకును నిర్మించాలని సూచించారు. రింగ్ రోడ్డు ప్రతిపాదనలు రూపొందించాలని ఇంటింటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు అదనపు కలెక్టర్ భుజంగరావు, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Special focus must be placed on city development.