ఆడపిల్లలలో ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, బతుకమ్మ : ఆత్మవిశ్వాసంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చునని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఆడపిల్లలలో ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు దోహదపడుతాయన్నారు. సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి మే 2 వరకు (వారం రోజుల పాటు) నిర్వహించే ఆర్మూర్ రోడ్డులోని ఆర్బీవీఆర్ఆర్ స్కూల్ లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సమ్మర్ క్యాంపును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడారు. పాఠశాలలోని చదువులకు సమ్మర్ క్యాంపులకు చాలా తేడాగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో ముందుకు వెళ్లాలి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే ప్రతి ఒక్క అంశంపై ఈ క్యాంపులో వివరిస్తామన్నారు. విద్యార్థులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు, ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించడం నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. శిబిరంలో వారు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, ధైర్యాన్ని ఎలా పొందాలనే దానిపై శిక్షణ పొందుతారన్నారు. శిబిరంలో, విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు సెల్ఫ్ మోటివేషన్ (ప్రేరణ) క్లాసెస్ కూడా ఉంటాయన్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తైక్వాండో టైలర్ మనోజ్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం నిజామాబాద్కు చెందిన మానసిక వైద్యుడు డాక్టర్ విశాల్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో సెల్ఫోన్ మోజులో తప్పుదారులు పడుతున్నారన్నారు. మంచి భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లే విధంగా పలు సూచనలు చేశారు. అనంతరం మోటివేషనల్ స్పీకర్, వై బ్రాంట్స్ ఆఫ్ కలాం తిరుణగిరి శ్రీహరి మాట్లాడుతూ.. సమాజంలో విద్యార్థులు ఎలా ఉండాలో మెలకువలను నేర్పించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఎలా ఎంచుకోవాలి ఎలా లక్ష్యసాధనకు ముందుకు వెళ్లాలో పలు అంశాలను క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సాయికిరణ్, యోగా గురువు కిషన్, జేసీఐ సభ్యులు విజయానంద్, సుమారు వందమంది విద్యార్థినిలు పాల్గొన్నారు.

