Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 5:15 pm Posted by : ramakrishna

మనమంతా ప్రశాంత వాతావరణంలో జీవనానికి సైనికులే కారణం

 

. . . సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ లో కలెక్టర్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెళ్లదీస్తున్నామని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాన్ని  పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం నుండి చేపట్టి న ర్యాలీని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబ సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయనిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్.సీ.సీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది జిల్లా పాలనాధికారి కి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, గౌరవ వందనం సమర్పించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో పాటు కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమవంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ, వారి పట్ల, వారి సేవల పట్ల గౌరవ భావంతో మెలగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. వారి గౌరవార్థం ప్రతి ఏటా జరిగే సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి మరింత అట్టహాసంగా నిర్వహించాలని, అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ  అధికారి రవీందర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Soldiers are the reason we all live in a peaceful environment.