. . . చెరువు సుందీకరణ పేరుతో మట్టి లూటి
. . . చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో అక్రమ నల్ల మట్టి, మొరం వ్యాపారం జోరుగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా పొద్దున్న ట్రాక్టర్లలో, రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా నల్ల మట్టిని ఇటుక బట్టీలకు, ప్రైవేట్ వెంచర్లలకు, తరలిస్తూ అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని ఎల్లయ్య నుంచి పెద్ద ఎత్తున నల్ల మట్టి తరలింపు జరుగుతున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మామూలు తీసుకుంటూ అధికారులు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు రైతులు, స్థానిక ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో భారీ టిప్పర్ల రాకపోకలతో పట్టణ రహదారులు దెబ్బతింటుండటంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తరలింపుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.