- ఫ్రొఫెసర్ ఎ.వినాయక రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ : సమాజంలో అసమానతలు పెరిగిపోయాయని, పాఠ్యాంశాలలో హేతువాద, లౌకిక భావాలను తొరగిస్తున్నారని సమాజానికి ప్రగతి శీల విద్యార్థుల అవసరం ఉందని ప్రొ.వినాయక రెడ్డి అన్నారు. పి డి ఎస్ యూ 23 వ నిజామాబాద్ జిల్లా మహాసభల సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో సి కన్వెన్షన్ లో ప్రతినిధుల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొఠారి కమీషన్ సిఫారసు ప్రకారం విద్యకు సరిపడా నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని, నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చి విద్యను మొత్తం కాషాయకరిస్తున్నారనీ అన్నారు. ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రో.ఆర్.లింబాద్రి మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రోత్సహించటం వలన పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరం అవుతున్నారనీ, ప్రభుత్వ యూనివర్సిటీ లలో పరిశోధనలు , రిక్రూట్మెంట్ జరగడంలేదని ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తున్నారని, కార్పొరేట్ యాజమాన్యాల కోసం ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులిస్తూ ఉన్నత విద్యను పేద విద్యారులకు అందకుండా చేస్తున్నారని అన్నారు. సమాజాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత పి డి ఎస్ యూ విద్యార్థుల మీద ఉందని అన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పస్క నర్సయ్య, పోచయ్య (టీచర్)గారు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని అధ్యయనం చేయాలని సమాజాన్ని మార్చే శక్తి విద్యార్థులకు ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జి.రమేష్, పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ పి డి ఎస్ యూ నాయకులు,ఆహ్వాన సంఘం సభ్యులు,ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సభలో అరుణోదయ సాంస్కృతిక కళారూపాలు, నృత్యం, పాటలతో సభను ఉత్తేజ పరుస్తూ, ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అరుణోదయ నాయకులు దాసు, అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.
