Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2025, 2:09 pm Posted by : ramakrishna

జాతీయ యువజన ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా శైలి బెల్లాల్

నిజామాబాద్, బతుకమ్మ: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ యువజన ఉత్సవాల్లో ఘనంగా  ప్రారంభమయ్యాయి. దేశంలోని ఆయా రాష్ర్టాల నుంచి యువతీయువకులు పాల్గొంటుండగా, తెలుగు రాష్ర్టాల ప్రతినిధిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యువజన అధికారిణి శైలిబెల్లాల్ హాజరయ్యారు. వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఎంపికైన యువతీయువకులకు ఇన్ చార్జీగా నిజామాబాద్ జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ నియమితులుకాగా, ఆమె ఆధ్వర్యంలో యువతీయువకుల బృందం కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, కె రామ్మోహన్ నాయుడు తో విడివిడిగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బృందానికి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి వచ్చిన బృందానికి జి కిషన్ రెడ్డి స్వాగత విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువతి యువకులతో కేంద్ర మంత్రులు తమ తమ ప్రాంతాలలోని విశేషాల గురించి అడిగి తెలుసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం యువత కోసం అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్ లో ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో యువతీయువకుల కోసం కేంద్ర ప్రభుత్వం  నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ను నెలకొల్పాలని, తద్వారా ఉమ్మడి జిల్లా యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆ దిశగా చొరవ తీసుకొని శిక్షణ సంస్థను కేటాయిస్తే దాని పూర్తి నిర్వహణ బాధ్యతను తాము తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విన్నవించినట్లు శైలి బెల్లాల్ తెలిపారు.  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పౌర విమానాయన శాఖ లో ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో అవసరమయ్యే శిక్షణ కేంద్రాలను విమానయాన శాఖలో ఉండే ఉద్యోగ అవకాశాలను గుర్తించి తది అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి కలిగించడం కోసము తమ జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విన్నవించినట్లు తెలిపారు. ఇద్దరు కేంద్ర మంత్రులు తమ వినతులపై సానుకూలంగా స్పందించారన్నారు. రెండు రాష్ట్రాల యువతీయువకులకు నేతృత్వం వహించే అవకాశం రావడం, ఇన్ చార్జీగా రెండు రాష్ట్రాల ప్రతినిధిగా జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొనడం ఒక గొప్ప అనుభూతిగా ఉందని, తనను నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన యువజన మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలుపుతున్నానని శైలి బెల్లాల్ అన్నారు.

Shyle Bellal as representative of Telugu States in National Youth Utsavs