నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ఖిల్లా రోడ్ లో గల ఎన్ ఎన్ ఫంక్షన్ హాల్లో షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యలో శనివారం రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లీంలకు నిత్యావసర సరుకులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అంతకు ముందు నిజామాబాద్ పట్టణంలోని పలు ఈద్గాలను ప్రభుత్వ సలహాదారు

షబ్బీర్ అలీ సందర్శించారు. రంజాన్ పండుగ వస్తున్న సందర్భంగా ఈద్గాల వద్ద వసతులను, అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పట్టణంలోని జదీద్ ఈద్గా, మదీనా ఈద్గా, ఐలే హదీస్ ఈద్గా, లను సందర్శించినట్లు తెలిపారు. మదినా ఈద్గా అభివృద్ధికి బోర్ మోటర్ అక్కడి స్థలాన్ని చదును చేయడానికి 300 ట్రిప్పుల మొరం వేయించడానికి సూచించినట్లు తెలిపారు. పండుగ రోజు తాగునీరు, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏలాంటి అవకతవకలు జరగకుండా పనులన్నీ సమయానికి సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. రంజాన్ పండుగను అందరూ కలిసి సామరస్య పూర్వకంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ తాహెర్, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జావిద్ అక్రం, హరోన్ ఖాన్ తదితరులు ఉన్నారు.
