- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బంజారా ప్రజల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గిరిజనులకు చేసిన సేవలు మరువలేనివని , బంజారా జాతి బిడ్డల అభివృద్ధికి, వారిని చైతన్యం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు సేవాలాల్ మహారాజ్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఇంద్రాపూర్ సంతోష్ నగర్ లో గురువారం సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు.

గిరిజనులు మధ్య, మాంసాలకు దూరంగా ఉండాలని జంతు బలిని వ్యతిరేకించి అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసి బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులని కొనియాడారు. హిందూ ధర్మ రక్షణలో సేవాలాల్ చేసిన కృషి మరువలేనిదని, 18వ శతబ్దంలో ఓ వైపు క్రిస్టియన్ మిషనరీలు, మరో వైపు నిజాం మాత మార్పిళ్ళు చేస్తుంటే వారికీ వ్యతిరేకంగా బంజారా జాతికి ఏకం చేసి వారిని హిందూ ధర్మం వైపు నడిపిన హిందూ ధర్మరక్షకులు సేవాలాల్ మహారాజ్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలకు గుర్తుగా పార్లమెంట్ లో అతని విగ్రహాన్ని పెట్టాలని మన ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేయడం గిరిజన బిడ్డలు సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, మోర్చా నాయకులు, సుందర్ సింగ్ రాథోడ్, మండల అధ్యక్షులు నాగరాజు, మాజీ కార్పొరేటర్ నారాయణ,బీజేపీ నాయకులు ప్రభాకర్, కిరణ్, సాయి నాథ్,తదితరులు పాల్గొన్నారు.
