Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 7:43 pm Posted by : ramakrishna

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి

  • జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • చింతకుంటలో పాఠశాలలు, అంగన్వాడి కేంద్రం తనిఖీ

 

మోస్రా, బతుకమ్మ : విద్యార్ధి దశ ఎంతో కీలకమైనదని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఏకాగ్రతతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఉద్బోధించారు. గురువారం ఆయన మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్, అంగన్వాడి సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి విద్యార్థిని, విద్యార్థులతో భేటీ అయ్యారు. వారిని పలు ప్రశ్నలు వేసి, బోధనా సామర్ధ్యాన్ని అంచనా వేశారు. విద్యార్థుల సందేహాలను కలెక్టర్ ఎంతో ఓపికగా నివృత్తి చేస్తూ, అంకిత భావం, పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మార్గనిర్దేశం చేశారు. జిల్లా పాలనాధికారిగా తన ప్రస్థానం గురించి తెలియజేస్తూ, విద్యార్థుల్లో స్పూర్తిని పెంపొందించారు. ఉన్నత స్థానాలకు చేరితే విస్తృత స్థాయిలో ప్రజలకు, సమాజానికి సేవ చేసే అవకాశం, అదృష్టం లభిస్తుందని, తద్వారా వ్యక్తిగతంగా మంచి భవిష్యత్తు, గౌరవం దక్కడంతో పాటు ఎంతగానో సంతృప్తి దక్కుతుందని సూచించారు. చదువులో ఎలా రాణించాలి, పరీక్షల్లో విజయం ఎలా సాధించాలి, లక్ష్యానికి అనుగుణంగా సిలబస్ ను

Set high goals and move forward.

ఏవిధంగా సకాలంలో పూర్తి చేసుకోవాలి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు, తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలి తదితర అంశాలను విద్యార్థులకు కలెక్టర్ సవివరంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంతో పాటు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, ఎలాంటి సందేహాలు ఉన్నా నిస్సంకోచంగా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. విద్యార్ధి దశలో కష్టపడితే, మిగితా జీవితమంతా తమ కుటుంబంతో కలిసి హాయిగా గడపవచ్చని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. ప్రభుత్వం కేటాయించిన ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ అయ్యాయా, ఏకరూప దుస్తులను అందిచారా అని ఆరా తీశారు. అంతకుముందు కలెక్టర్ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రంలో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించి, విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. డైట్ ప్లాన్ ను తూచ తప్పకుండా పాటించాలని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ ను ఆదేశించారు. పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని, ఉత్తమ ఫలితాలు సాధించేలా నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాగా, ప్రైమరీ పాఠశాలలో బాలుర కోసం వెంటనే టాయిలెట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీఓ శ్రీనివాస్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

Set high goals and move forward.