Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 9:04 am Posted by : ramakrishna

డబ్బులు పంపండి.. దోషాలు పొగొడతాం..

శ్రీకాళహస్తిలో జోరుగా సాగుతున్న దందా

శ్రీకాళహస్తి, బతుకమ్మ : ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయానికి రాహు-కేతు సర్పదోష నివారణ పూజల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తుల విశ్వాసాన్ని స్వార్థానికి వాడుకునేందుకు కొంతమంది మోసగాళ్లు తెగబడుతున్నారు. మీ జాతకంలో దోషాలున్నాయి… డబ్బులు పంపితే మేమే మీ పేరుతో పూజలు చేయిస్తాం అంటూ ప్రైవేటు వ్యక్తులు భక్తులను మభ్యపెడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వివాహం, సంతాన సమస్యలతో ఆలయాన్ని ఆశ్రయించే యువ భక్తులే వీరి లక్ష్యంగా మారుతున్నారు.

జాతకంలో  దోషాలున్నాయని… నమ్మించి

ఆలయంలో పనిచేసే కొంతమంది అర్చకులకు కూడా  ఇటీవల ఈ తరహా మోసపూరిత కాల్స్ రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫోన్లు చేసే వారు భక్తుల ఫోన్ నంబర్లను ఎలా సేకరిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధానంగా శ్రీకాళహస్తి పరిసరాలలోని ప్రైవేటు లాడ్జీల్లో బస చేసే భక్తుల వివరాలు తెలుసుకుని.. వారిని మౌఖికంగా సంప్రదించి నంబర్లు పొందుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నెలల రోజుల తర్వాత ఫోన్ చేసి జాతకంలో  దోషాలున్నాయని.. వీటి నివారణకు పూజలు అవసరమని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు….ఇలాంటి మోసాల్లో పూజలే కాకుండా హోమాలు, శాంతి పూజలు, యాగాలని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ముక్కంటి ఆలయంలో పనిచేసే అర్చకుని కుటుంబ సభ్యుడికి వచ్చిన ఫోన్‌కాల్ ఈ మోసపు వ్యవహారాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఆ వ్యక్తి ఆలయం పరిధిలో కాకుండా బయట ప్రాంతంలో ఉండటం గమనార్హం. భక్తులు అధికారిక వేదికలపై మాత్రమే పూజలకు పేర్లు నమోదు చేసుకోవాలని.. ఎలాంటి ఫోన్‌కాల్‌లను నమ్మరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.