జుక్కల్ , బతుకమ్మ :
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ బస్టాండ్ సమీపంలో ఉన్న 15 కె.వి. డీటీఆర్ (ట్రాన్స్ ఫార్మర్) కాలిపోవడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ వెంటనే గ్రామ లైన్మన్ కె. మారుతికి తెలియజేశారు. సమస్య తీవ్రతను గుర్తించిన సర్పంచ్ చర్యలు తీసుకుని కొత్త 15 కె.వి. డీటీఆర్ను తెప్పించి, చీకటి అయినప్పటికీ రాత్రి 8 గంటల సమయంలో విద్యుత్ శాఖ సిబ్బందిని పిలిపించి ట్రాన్స్ ఫార్మర్ మార్పిడి పనులు చేపట్టించారు. సర్పంచ్ రమణ సురేష్ గొండ స్వయంగా అక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కారోబారి ఎం. గంగారం, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు, గోపాలమిత్ర వాలంటరీ రాములు, గ్రామ విద్యుత్ వర్కర్ ముంచేవారు, దత్తరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించడంతో సర్పంచ్, విద్యుత్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.