బోధన్, బతుకమ్మ :
మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో ద్వారా కేవలం రూ.299/-లకే సమ్మక్క– సారక్క అమ్మవార్ల ప్రసాదాన్ని ఇంటి వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు బోధన్ డిపో మేనేజర్ బి. విశ్వనాధ్ తెలిపారు. సోమవారం బోధన్ పట్టణంలోని డిపో కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన సమ్మక్క–సారక్క ప్రసాదం పంపిణీ కరపత్రాలను డిపో మేనేజర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, www.logistics.co.in వెబ్సైట్ ద్వారా లేదా సమీప ఆర్టీసీ కార్గో కౌంటర్ల వద్ద బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. ఈ ప్యాకేజీలో బెల్లం (బంగారం), పసుపు, కుంకుమతో పాటు అమ్మవార్ల ఫోటో ఉంటుందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది గిరి, రాములు, సందీప్, నవీన్ కుమార్తో పాటు బోధన్ డిపో కార్గో డీఎంఈ కిశోర్ పాల్గొన్నారు.