నిజామాబాద్ క్రైం, బతుకమ్మ
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సాయి చైతన్య మొన్నటి వరకు నార్కొటిక్స్ విభాగం ఎస్పీగా పనిచేశారు. ఇటీవల రాష్ట్రంలో 21మంది ఐపీఎస్ ల బదిలీ సందర్భంగా సాయిచైతన్యను నిజామాబాద్ సీపీగా నియమించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నగరంలో ప్రసిద్ధ నీలకంఠేశ్వర దేవాలయంలో సతీసమేతంగా కొత్త పోలీస్ కమిషనర్ పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇస్తానని కొత్త కొత్వాల్ పోతరాజు సాయి చైతన్య పేర్కొన్నారు. మహిళా భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. యువత డ్రగ్స్ బారీన పడి తమ బంగారు భవితను పాడు చేసుకోకుండా ఉండేందుకు డ్రగ్స్ రహిత సమాజానికి క్రుషి చేస్తానని పేర్కొన్నారు. సైబర్ నేరాలు అనేవి పట్టణాల నుంచి గ్రామాలకు కూడా చేరుకున్నాయని, వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను జిల్లా పోలీస్ అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
