నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా దేశంలో పెరుగుతున్న మతోన్మాద శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆర్ఎస్పీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా కన్వీనర్ కటారి రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గత పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నగరాన్ని సమస్యల నిలయంగా మార్చారని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి, మంచినీటి కొరత, మురికి కాలువల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని అన్నారు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చడంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. నగర అభివృద్ధి సాధించాలంటే, యువకులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు తమ అమూల్యమైన ఓటును వినియోగించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతావత్ సురేఖను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మతం, కులం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే శక్తులకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, అభివృద్ధి దిశగా నగరాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తులకు మద్దతు ఇవ్వాలని ఆర్ఎస్పి పార్టీ పునరుద్ఘాటించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవేందర్,మల్యాల గోవర్ధన్, కేతవత్ అమర్ సింగ్, పార్టీ నాయకులు పిట్లా నరేష్, బోడ అనిల్, రఫీ ఉద్దిన్, గోపాల్ సింగ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.