. అంగన్ వాడీ కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం
. మాగి సెంటర్ లో చిన్నారులు, బాలింతలకు ఇబ్బందులు
నిజాంసాగర్, బతుకమ్మ: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిజాంసాగర్ మండలం మాగి అంగన్ వాడీ సెంటర్ లో చిన్నారులు, బాలింతలకు కుళ్లిన గుడ్లు, పాడైన పౌష్టికాహారాన్ని అందించారు. ఇదేమిటని ఓ యువకుడు నిలదీస్తే తమకు వచ్చినవి ఇస్తున్నామని సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటన అంగన్ వాడీ సెంటర్లలో నిర్లక్ష్యం, అవినీతి పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల నిజాంసాగర్ మండల మండల కేంద్రంలోని బంజపల్లి అంగన్ వాడీ సెంటర్ లో కూడా ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోగా నాణ్యత లేని పౌష్టికాహారం సాధ్యమవుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంగన్ వాడీ సెంటర్ లపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్న సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఒక్క బంజపల్లి మాగి గ్రామంలోనే కాదు ఉమ్మడి నిజాంసాగర్ మండల పరిధిలో అంగన్ వాడీ సెంటర్ల నిర్వాహకులు విధులను నిర్లక్ష్యం చేస్తూ ఆయాలతో నెట్టుకొస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అంగన్ వాడీ కేంద్రాల పై దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.