నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని శ్రీ చైతన్య పాఠశాలలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 1,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, ట్రిపుల్ రైడింగ్ నిషేధం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సంభవించే ప్రమాదాలు మరియు చట్టపరమైన చర్యల గురించి ట్రాఫిక్ అధికారులు వివరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతగా వ్యవహరించి ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గురుచరణ్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
