Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 5:14 pm Posted by : ramakrishna

రోడ్ల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

  • పనుల ప్రగతిని పరిశీలించిన కలెక్టర్

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపర్చేందుకు వీలుగా చేపడుతున్న రోడ్డు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రహదారులకు మరమ్మతులు జరిపిస్తుండగా, క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద, బైపాస్ రోడ్డు మార్గంలో, డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై కొనసాగుతున్న రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, పది కాలాల పాటు ఈ పనులు ప్రజలకు ఉపయుక్తంగా నిలిచేలా మన్నికగా జరిపించాలని సూచించారు. కాగా, నిజామాబాద్ నగరంలో గోల్ హనుమాన్ నుండి పూసలగల్లి కి వెళ్ళే మార్గంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సి ఉన్న ప్రాంతాలను సైతం కలెక్టర్ పరిశీలించారు. పనులను ఇంకనూ ప్రారంభించకపోవడం పట్ల ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, వారం, పది రోజుల అనంతరం తాను మరోమారు క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతో పాటు పనుల ప్రగతిని సమీక్షిస్తానని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ అధికారి ప్రవీణ్, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, ఇనాయత్ తదితరులు ఉన్నారు.

Road repair work should be completed on a war footing.