Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 6:13 pm Posted by : ramakrishna

జిల్లాలో 22.9శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గుదల

  • సదాశివ నగర్ వద్ద స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు
  • కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ

 

కామారెడ్డి, బతుకమ్మ : 2024 ఆగస్టు వరకు జిల్లాలో మొత్తం 188 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 2025 ఆగస్టు వరకు వాటిని 145కి తగ్గించగలిగామని, దీని ద్వారా మొత్తం 22.9 శాతం రోడ్డు ప్రమాదాల తగ్గుదల నమోదైందని కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,  జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సోమవారం సదాశివనగర్ ఎన్‌హెచ్-44 వద్ద అయ్యప్ప ఆలయం సమీపంలో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే  వేగ నియంత్రణ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా చాలనాలు జారీ చేస్తామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.  మరణాలు 197 నుండి 153కి తగ్గి 22.3% తగ్గుదల ఉన్నదని తెలిపరు. గాయపడ్డ కేసులు కూడా  181 నుండి 173కి తగ్గగా, గాయపడిన వ్యక్తులు 355 నుండి 298కి తగ్గడం ద్వారా రోడ్డు ప్రమాదాల నియంత్రణలో గణనీయమైన తగ్గుదల నమోదైందని తెలిపారు. ఇది జిల్లా స్థాయిలో రోడ్డు భద్రతా చర్యల విజయాన్ని సూచిస్తూ, ప్రజల ప్రాణ రక్షణలో ఒక గొప్ప ముందడుగుగా నిలిచిందని పేర్కొన్నారు.  ప్రతిరోజూ వాహన తనిఖీలు,  డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లు, హెల్మెట్,  లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు, అతివేగంగా ప్రయాణించే వారిపై జరిమానాలు విధించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు.   కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొత్తం మూడు స్పీడ్ లేజర్ గన్స్ వాహనదారుల  వేగాన్ని నియంత్రించడం కొరకు పనిచేస్తున్నాయని తెలిపారు.   అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి క్రమంగా వారి వాహణముల వేగనియంత్రణ చేయడం, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.  ఈ లేజర్ గన్స్ జాతీయ రహదారి (NH-44), జాతీయ రహదారి (NH-161), రాష్ట్ర రహదారులపై ఏర్పాటు చేశామని తెలిపారు.

Road accidents in the district decrease by 22.9 percent