- డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : జిల్లా సహకార వ్యవస్థ కి పునర్వైభవం, జిల్లా సహకార బ్యాంకు ద్వారా సహకార సంఘాలకు డివిడెండ్ విడుదల అయిందని డీసీసీబీ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన జిల్లా సహకార బ్యాంకు 103 వ వార్షిక మహాజన సందర్భంగా సహకార సంఘములకు డివిడెండ్ ప్రకటించి, ఖాతాలలో జమచేసినందుకు కృతజ్ఞత గా సహకార సంఘముల యూనియన్ నాయకులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి ని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి జిల్లా సహకార వ్యవస్థ అభివృద్ధికి అంకితభావంతో సేవలు అందిస్తూ తన ఆలోచనలతో సహకార బ్యాంకు, సహకార సంఘములు అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. తన నిర్ణయాలతో మరియు ఖచ్చితత్వం తో బ్యాంకును వెన్నుతట్టుతూ, ఉద్యోగుల ను ప్రోత్సహిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. సహకార బ్యాంకు నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించి, వీక్ బ్యాంక్ స్టేటస్ తొలగించి, ప్రస్తుతం రాష్ట్ర సహకార రంగం జిల్లా వైపు చూసేలా చేసి, గత 10 సంవత్సరములలో ఎన్నడూ లేని విధముగా సహకార సంఘములకు డివిడెండ్ ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నల్ల చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు లింగయ్య, రమేష్ పాటిల్,బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే పాల్గొన్నారు.