. . . దొడ్డు వడ్ల పేరుతో రైతులను వేధించడం దారుణం
. . . తరుగు పేరుతో క్వింటాల్కు 4 – 5 కిలోల కోతలతో రైతుల నిలువు దోపిడీ
. . . బడా భీమ్గల్, బషీరాబాద్ లలో కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ, బతుకమ్మ :
రైతులు కష్టపడి పండించిన పంటను నిలువు దోపిడీ చేస్తున్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తాలు తీస్తే తోలు తీస్తా అన్నారు. ఇప్పుడు మరి ఎవరి తోలు తీయాలి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కిలో తరుగు తీస్తే గొడవ చేసిన వారు ఇప్పుడు క్వింటాల్ కు 4 నుంచి 5 కిలోల తరుగు తీస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలోని ఐకేపీ, ప్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను పరిశీలించిన ఆయన, అక్కడ నెల రోజులుగా ధాన్యపు కుప్పల వద్దే నిరీక్షిస్తున్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రైతులు తమ గోడును ఎమ్మెల్యేకు వివరిస్తూ, ఏప్రిల్ 2, 3, 5 తేదీలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా ఇప్పటివరకు తూకం వేయలేదని, లారీలు రాకపోవడంతో ధాన్యం కుప్పలు అలాగే పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడా భీమ్గల్ గ్రామంలోని ఒక్క సెంటర్ లోనే సుమారు 50 లారీలకు కు పైగా ధాన్యం కుప్పలు పెండింగ్లో ఉన్నాయని రైతులు తెలిపారు. రైతుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్ఓ) లకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. హమాలీలు, లారీల కొరత పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, యుద్ధ ప్రాతిపదికన లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అన్నారు. “నెల రోజులుగా ఒక్క గింజ కూడా తూకం వేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం” అని విమర్శించారు. దొడ్డు వడ్ల పేరుతో రైతులను వేధించడం దారుణమని ఆయన అన్నారు. సన్న వడ్లకు ప్రకటించిన బోనస్ కుడా అందక రైతులకు సరైన లాభం చేకూర్చడం లేదని, దిగుబడి తక్కువగా రావడం వల్లే రైతులు దొడ్డు వడ్లు పండిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల ధాన్యాన్ని ఎలాంటి వివక్ష లేకుండా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే తరుగు పేరుతో జరుగుతున్న కోతలపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “క్వింటాల్కు 4 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికే బస్తాల్లో నింపిన ధాన్యం తడిసి ముక్కిపోతుందని తెలిపారు. రైతుల శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.“నేను వ్యక్తిగత పర్యటన కోసం అమెరికాలో ఉన్నప్పటికీ, రైతులు పడుతున్న కష్టాల గురించి తెలిసి వెంటనే నియోజకవర్గానికి వచ్చాను. రైతుల సమస్యలపై ప్రతి రోజు పర్యవేక్షణ చేస్తాను. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి గింజను కొనుగోలు చేయాలి. రైతులకు చెల్లించాల్సిన సొమ్మును వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలి. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుంది” అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
