. . . పర్యటనలకు, పోటీలకు ఉన్న నిధులు విద్యార్థులకు లేవా ?
. . . ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన విద్యార్థి పోరు కేక సభ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులతో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి పోరాట నినాదాలతో ధర్నా చౌక్ ప్రాంతాలు దద్దరిలాయి. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులు ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్షిప్స్ రాక చదువులకు దూరమవుతున్నారని, కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గతంలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే నేడు రేవంత్ రెడ్డి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని, అధికారంలోకి వస్తే ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 30 నెలలకు కావస్తున్న ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు చదువులతో చెలగాటమాడుతున్నారన్నారు.

ఒకసారి సెటిల్మెంట్ రూపంలో చెల్లిస్తామని చెప్పి, మరొకసారి విద్యార్థులు అకౌంట్లోకి వేస్తామని చెప్పి కాలక్షేపం చేస్తున్నారని, కానీ ఫీజు రీఎంబర్స్ మెంట్ రాక సర్టిఫికెట్ తీసుకోవడానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్న బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి తరచూ రాష్ట్ర అప్పుల్లో ఉందంటూ విద్యార్థులకు మాత్రమే బకాయిలు ఇవ్వకుండా అందాల పోటీలకు, ఫుట్ బాల్ పోటీలకు, కేరళ పర్యటనలకు ఢిల్లీ పర్యటనకు ఉన్న నిధులు విద్యార్థులు చదువులకు ఎందుకు లేవని ? వెంటనే 11 వేల కోట్ల బకాయిలన్నింటినీ ఏకకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలకు పిలుపునిస్తాం. అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బానోతు రఘురాం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించేలా ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇవ్వడం లేదని, ఫీజు రీఎంబర్స్ మెంట్ రాక విద్యార్థులు పడుతున్న బాధలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఓవైపు విద్యార్థులు మరోవైపు కళాశాలల యాజమాన్యాలు కూడా ఫీజు బకాయిలు రాక కళాశాలల నిర్వహణ చేయలేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక భవన కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఇచ్చిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలని రఘురాం నాయక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు సుధాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కైలాష్, అనూష జిల్లా నాయకులు కుషాల్, కిషోర్, మహిపాల్, నీరజ్, భాను, పవన్, శివ, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
