Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 8:05 pm Posted by : ramakrishna

ఆర్మూర్ లో మళ్ళీ విచారణ

  • గతంలో డిఈ చేసిన పనులపై అధికారుల విచారణ
  • ఆనాడు చర్యలు తీసుకోకుండా బదిలీతో సరిపెట్టిన వైనం
  • విచారణతో నిజాలు వెలుగులోకి వచ్చేనా..?

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యుత్ శాఖ ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ లో వరంగల్ నుంచి వచ్చిన అధికారులు విచారణ జరుపడం కలకలం రేపింది. డివిజన్ పరిధిలో గతంలో పని చేసిన డిఈ  హయంలో జరిగిన పనులపై సీఈ స్థాయి అధికారి విచారణ జరిపారు. గతంలో పని చేసిన డిఈ హయంలో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన విషయం తెల్సిందే. ఆనాడు ఉన్నతాధికారులు విచారణ జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్మూర్ డిఈని జిల్లా నుంచి ఇతర జిల్లాకు బదిలీ చేశారు. కానీ విచారణ పెండింగ్ లో ఉండడంతో ఇటీవల మరోసారి విచారణాధికారులు ఆర్మూర్ లో పలువురిని విచారించారు. అదే విధంగా ఆనాడు జరిగిన పనుల తాలుకు వివరాలను సేకరించారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లతో పాటు ఏడీఈలను, ఏఈలను, సిబ్బందిని విచారించడం విశేషం. ఇటీవల పెర్కిట్ కు సంబంధించిన ఏఈని కూడా విచారించినట్లు తెలిసింది. 2022 -23 మధ్య జరిగిన అవకతవకలు, అక్రమాలపై కొందరు ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా ఫిర్యాదులు చేసిన విషయం తెల్సిందే. ఆనాడు దానిపై స్పందించిన వరంగల్ కార్పొరేట్ కార్యాలయం డిఈ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. దాదాపు ఏడాది క్రితం జరిగిన విచారణను మరోసారి చేయడంతో విద్యుత్ శాఖలో కలవరం మొదలయింది. ఆనాడు అధికారులు పూర్తి స్థాయి ఇవ్వకపోవడం వలన విచారణ తూతూ మంత్రంగా జరిపారని అందుకే బదిలీతో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి తప్పించుకున్నారనే వాదనలున్నాయి. ఈసారి అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ నిక్కచ్చిగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని పవర్ హౌజ్ లో చర్చ జరుగుతుంది.